తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహిస్తామని అన్నారు. భారత పార్లమెంటులో కూడా పీవీ విగ్రహాన్ని పెట్టాలని కోరతామన్నారు. దేశానికి పీవీ చేసిన సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆర్ధిక సంస్కరణలు, భూ సంస్కరణలు, విద్యారంగంలో మార్పులను గొప్పగా అమలు చేసి దేశ ప్రగతి పరుగులు పెట్టేలా పీవీ కృషి చేశారన్నారు.
దక్షిణ భారతదేశం నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి పీవీ అని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలే దేశాన్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని, వాటినే మనమంతా అనుభవిస్తున్నామని అన్నారు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన రెండో వ్యక్తి పీవీ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. అలాగే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ చర్చలో పాల్గొని మాట్లాడుతూ, తీర్మానాన్ని బలపరిచారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu