మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ క్యాలెండర్-2021 ని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గల తన కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి, ఉపాధిహామీ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
ఉపాధిహామీలో తెలంగాణనే దేశంలో నెంబర్ వన్:
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అత్యంత విజయవంతంగా నిర్వహించి, తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా నిలిపిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధి కూలీలు అందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యధికంగా 18కోట్ల పని దినాలను పూర్తి చేసిన ఘనత తెలంగాణది. ఇది చరిత్రాత్మకం. ఈ ఘనత మన అందరిదీ. దీన్ని సాధించిన తీరు అమోఘం. అద్వితీయం. గతంలో ఉపాధి పనులు అతి తక్కువగా జరిగేవి. కొద్ది మందికి మాత్రమే ఉపాధి దక్కేది. ఉపయోగ పడే పనులు జరిగేవి కావు. కానీ, ఇప్పుడు ఉత్పాదక రంగాలు, వ్యవసాయం, కాలువలు, రోడ్లు వంటి ఉపయోగపడే పనులు జరిగాయని మంత్రి చెప్పారు.
ప్రధాన మంత్రి, కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి సైతం అభినందించారు:
“ఈసారి అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించాం. కరోనా సమయంలో నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు తిరిగొచ్చిన వాళ్ళందరికి ఉపాధి కల్పించడం ఓ రికార్డ్. అలాగే లక్షలాది ఉపాధి హామీ జాబ్ కార్డులు కూడా కొత్తగా ఇచ్చాం. ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సాధించిన అద్భుతం. అయితే, ఇదంతా కేవలం మనం చెబుతున్న లెక్కలు కావు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు. కేంద్ర పరిశీలకులు సైతం, తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అనేక సార్లు అభినందించారు. అలాగే,ప్రధాన మంత్రి, కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి సైతం అభినందించారు” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇదే స్ఫూర్తిని ఉపాధి హామీ అధికారులు, ఉద్యోగులు కొనసాగించాలని మంత్రి సూచించారు.
అతి చిన్న గ్రామ పంచాయతీలకు కూడా కనీసం రూ.5 లక్షల నిధులు విడుదల:
అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు పల్లెల రూపు రేఖలను మార్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సరీలు, తడి పొడి చెత్తను వేరు చేసే డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు అమలు జరుగుతున్నాయి. రైతు కల్లాలు, రైతు వేదికలు నిర్మితమయ్యాయని చెప్పారు. గ్రామాలకు కేంద్ర నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల అవుతున్నాయని చెప్పారు. అతి చిన్న గ్రామ పంచాయతీలకు కూడా కనీసం రూ.5 లక్షల నిధులు విడుదల అవుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో నిరంతర పారిశుద్ధ్యం ప్రజలను ఆరోగ్యంగా ఉంచుతున్నయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీ లు, నీటి ట్యాంకర్లు, శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీరు ఇంటంటికి నల్లాల ద్వారా అందుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ పథకాలన్నీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు, ఉపాధి హామీ అధికారులు, ఏపీవోలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ