తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) లో భాగంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ ఆర్యూబీని నిర్మించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు తో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ఈ ఆర్యూబీని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ.6 వేల కోట్లతో పనులు పూర్తి:
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ఆర్యూబీ వలన అపారమైన లాభం జరగబోతోన్న అడ్డగుట్ట, లాలాపేట డివిజన్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నెలకున్న ఉన్న ఈ సమస్యకు ఇప్పటికి పరిష్కారం దొరికిందని, రూ.72 కోట్లతో రోడ్డు అండర్ బ్రిడ్జిని పూర్తిచేసుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మారావు గౌడ్ నాయకత్వంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ కింద రూ.6 వేల కోట్ల పనులు పూర్తి చేసుకున్నామని చెప్పారు. నగరంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అవసరమున్నా చోట ఆర్యూబీలు, ఆర్వోబీల నిర్మాణంపై ఇటీవల రైల్వే శాఖతో కూడా చర్చించామని చెప్పారు. నగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం గట్టి పట్టుదల, కృతనిశ్చయంతో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ