ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని సీఎం అన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని సీఎం అన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల కోసం 1 లక్ష 116 రూపాయల సాయం అందించి, ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తున్నది అని సీఎం తెలిపారు. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని అన్నారు. మైనారిటీ విద్యార్థులకు గురుకులాల ద్వారా అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నదనీ సీఎం అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు. లౌకిక వాద విఘాత శక్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ