రాష్ట్రంలో వానాకాలం సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని జూన్ 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయినా రైతుల కోసం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుండి 9వ విడత రైతుబంధు సాయం పంపిణీ జరుగుతుందన్నారు. కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతుబంధు పథకం ఆగకుండా అమలవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయ రంగం పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనమని మంత్రి తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతుబంధు పథకం అమలు:
“దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నాం. రైతుబంధు కింద వానాకాలం, యాసంగి సాగులో రైతాంగానికి ప్రభుత్వ పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ ఏడాది వ్యవసాయం బాగుండాలని, పంటలు బాగా పండాలని, రైతుల కష్టానికి రైతుబంధు సాయం ఆసరా అవుతుందని ఆశిస్తున్నాము. ఈ నెల 28 నుండి రైతుబంధు అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అర్హులయిన రైతుల వివరాలు పంపించాలని సీసీఎల్ఏను వ్యవసాయ శాఖ కోరింది. గత ఏడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్ల రైతుబంధు సాయం, గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7412.53 కోట్ల రైతుబంధు సాయం అందించాం. 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్ లో రైతుబంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయింపు జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది విడతలలో మొత్తం రూ.50,447.33 కోట్ల సాయం రైతులకు అందింది. ఈ నెల 28 నుండి యధావిధిగా రైతుబంధు సాయం గతంలో మాదిరిగానే రోజుకు ఎకరా చొప్పున ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY