తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ రావు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసారు. నవంబర్ 8, శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. 5,100 రూట్లలో ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గ తీసుకున్న నిర్ణయాలను కోర్టు ముందు ఉంచాలని తెలిపింది. అదే విధంగా పిటిషనర్ అభ్యంతరాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ను కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబర్ 11, సోమవారం నాటికీ వాయిదా వేసింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లు, కార్మికుల జీతాల నిలుపుదల అంశాలకు చెందిన విచారణను కూడా నవంబర్ 11న హైకోర్టు చేపట్టనుంది.
[subscribe]