కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాలు- రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకినవారు, వైరస్ తో మరణిస్తున్నవారు అత్యధిక శాతం మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందినవారేనని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఈ జిల్లాల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా లాక్డౌన్ ను కొనసాగించాలని కోరారు
“ఇప్పటి వరకు 1085 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. వారిలో 585 మంది డిశ్చార్జి అయ్యారు. 29 మంది మరణించారు. 471 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల్లో 66.08% (717), మరణించిన వారిలో 82.21% మంది హైదరాబాద్, పరిసర జిల్లాలకు చెందిన వారు. గడిచిన 10 రోజుల్లో కూడా అత్యధిక శాతం కేసులు ఈ జిల్లాలనుండే నమోదయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువ కావున ఏమాత్రం పట్టు సడలించినా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను యథావిధిగా, అవసరమైతే మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని” వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి చాలా మెరుగైంది. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గింది. ఆ జిల్లాల్లో రెడ్ జోన్లు ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను మే 5, మంగళవారం నాడు జరిగే సమావేశంలో మంత్రిమండలి విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
అనంతరం సీఎం కేసీఆర్ స్పందిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, జనార్థన్ రెడ్డి, రామకృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu