తెలంగాణలో టీడీపీ ఎక్కడని ప్రశ్నించే వారికి ఈ సభే సమాధానం అని, రాష్ట్రంలో పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ లేకపోయినా ఈ సభకు భారీగా హాజరైన కార్యకర్తలు, ప్రజలను చూస్తుంటే మళ్లీ బలోపేతం అవుతుందన్న నమ్మకం, విశ్వాసం కలుగుతోందని పేర్కొన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బుధవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ ‘విజయ శంఖారావం’ పేరుతొ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీదనేనని, టీడీపీ హయాంలోనే హైదరాబాద్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని, సాగర్ ఎడమ కాలువను అభివృద్ధి చేయడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ దేవాదుల, భీమా, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించామని వెల్లడించారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు తాగునీటి పథకాలు ఏర్పాటు చేశామని, ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని తెలిపారు. ఇక టీడీపీ హయాంలో నిర్మించిన కరకట్ట వల్లే ఇటీవల వచ్చిన భారీ వరదల నుంచి భద్రాచలం పట్టణం క్షేమంగా బయటపడిందని ఆయన చెప్పారు. అలాగే గచ్చిబౌలి స్టేడియం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, బిజినెస్ స్కూల్, జాతీయ రహదారులతో పాటు హైటెక్ సిటీ వంటివి నిర్మించడం ద్వారా తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చామని వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్నందున రాష్ట్రం విడిపోయిందని, రాష్ట్రాలుగా విడిపోయినా రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలన్నదే మా విధానమని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే కొందరు సిగ్గులేకుండా రెండు రాష్ట్రాలు కలవాలంటున్నారని, అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెద్దామని, పార్టీని వీడిన నేతలు మళ్ళీ తిరిగి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ