తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలకు క్రిస్టమస్ బహుమతులను అందించి, వారిని ఆప్యాయంగా పలకరించి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు. తూచా తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలే జరగవు. మనలను మనము ఎంతగా ప్రేమించుకుంటామో కూడా అంతగా ప్రేమించాలి అనే మానవత్వం క్రీస్తు సొంతం. తనను హింసించిన వారిని సైతం క్షమించే గుణం మహోన్నతమైనది. క్రీస్తు బోధనలకు మరింత ప్రచారం జరగాలి, వసుదైక కుటుంబ భావన విశ్వమంతా పరిణవిల్లాలి” అని అన్నారు.
“శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే స్ఫూర్తితో భారత దేశ ప్రగతిని సాదిద్దాం.ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి సహకారం అవసరం” అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి దూత ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవత్వానికి వసుదైక కుటుంబ స్థాపనకు దారులు వేస్తాయని సీఎం అన్నారు. క్రీస్తు బోధనలను తూచా తప్పకుండా పాటిస్తే కోపము, ద్వేషము ఉండవని, ప్రతి మనిషి క్షమాగుణంతో జీవిస్తే ఈ నేలమీద యుద్ధాలే జరగవని సీఎం స్పష్టం చేశారు. రాగ ద్వేషాలకు అతీతంగా మనిషి ఉన్నతమైన సంఘజీవిగా ఎదుగుతాడని సీఎం అన్నారు. “జీసస్ క్రీస్తు కాంక్షించిన ప్రపంచం మహోన్నత మైనది, ఉదాత్తమైనది. క్రీస్తు అందించిన బాటలో పయనిస్తే, లక్ష్యాన్ని సాధించగలిగితే మనిషి దేవుడు అవుతాడు” అని సీఎం ఆన్నారు.
తాను నమ్మిన వ్యక్తుల చేతిలోనే హింసలు పడుతూ హత్యకు గురయ్యే సందర్భంలో వారిని క్షమించే మహోన్నత క్షమాగుణం క్రీస్తు సొంతమన్నారు. విశ్వమంతా ఒకే కుటుంబం లాగా, వసుదైక కుటుంబం అనే భావన క్రీస్తు మనకు బోధించారనీ సీఎం తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనిషి ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో మరింతగా కరుణ, దయతో కూడిన మానవీయుడిగా మనిషిని ఉన్నతంగా ఎదగాలని సీఎం అన్నారు. శాంతి సౌభ్రాతృత్వన్ని పంచే క్రీస్తు బోధనలు యధాతధంగా ఎంత గొప్పగా ప్రచారంలోకి వస్తే ఈ ప్రపంచానికి అంత గొప్ప మేలు జరుగుతుందన్నారు.
“20 ఏళ్ల క్రితం అశాంతితో, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను జై తెలంగాణ నినాదంతో శాంతియుత పద్ధతిలో సాధించుకున్నం. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలుపుకున్నం. అదే స్ఫూర్తితో నేడు జై భారత్ నినాదాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నం. ఈ క్రమంలో ప్రగతికి తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరి సహకారం కావాల్సి వుంది.” అని సీఎం అన్నారు.త్వరలోనే క్రైస్తవ మత పెద్దలతో రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం ఎల్బీ స్టేడియం చేరుకున్న సీఎం కేసీఆర్ తొలుత అనాధ పిల్లల వద్దకు వెళ్లారు. వారికి క్రిస్టమస్ బహుమతులను అందించి వారిని ఆప్యాయంగా పలకరించి, వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేదిక పైన ఏర్పాటుచేసిన క్రిస్మస్ ట్రీ ని వెలిగించారు. క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్టియన్ మత పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మత పెద్దలు కలిసి సీఎం కేసీఆర్ కి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమం ఆనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీఎంఓ అధికారులు, కార్డినల్ పూల ఆంథోనీ తో పాటు పలువురు క్రైస్తవ మత సంఘాల పెద్దలు, బిషప్ లు, ప్రభుత్వ మైనారిటీ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE