తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం నాడు జరిగిన పోలీసుల సోదాల ఘటన పరిశీలనకై వెళ్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కరీంనగర్ లోని తన కార్యాలయంలో ఆయన సోమవారం రాత్రి నుంచి దీక్ష చేపడుతున్నారు. సిద్ధిపేట సీపీని వెంటనే బదిలీ చేసి, కేసు నమోదు చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
దుబ్బాక వెళ్లేందుకు తనకు ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నా కూడా పోలీసులు తనపై అమర్యాదగా, దురుసుగా వ్యవహరించారని అన్నారు. సిద్దిపేటలో సోమవారం నాడు జరిగిన ఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, బలగాలను పంపించి ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఉపఎన్నిక నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా సమన్వయం పాటించి నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu