తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. సిద్దిపేట జిల్లాలోని తొగుట, కొండపాక మండలాల సరిహద్దుల్లో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముందుగా రిజర్వాయర్ వద్ద పంప్ హౌస్ మోటార్లను సీఎం కేసీఆర్ స్విఛ్ ఆన్ చేసి మల్లన్న సాగర్ లోకి నీటిని విడుదల చేశారు. అలాగే రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలకు మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి మల్లన్నకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-4లో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.6,805 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయరే అతిపెద్దది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటుగా, మరో 7,37,250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. రంగనాయకసాగర్ నుంచి తుక్కాపూర్ పంపు హౌస్కు చేరిన జలాలను మల్లన్నసాగర్ రిజర్వాయర్ లోకి తరలించనున్నారు. మరోవైపు భవిష్యత్ లో హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకోసం మల్లన్నసాగర్ నుంచి 30 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు. ఇక మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం రిజర్వాయర్ వద్దే నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ