రాష్ట్రంలో రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొత్తం 54.21 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందిందని చెప్పారు. ఇందులో 74,084 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారుల (ఏజెన్సీ ఏరియాలోని ఎస్.టీ రైతులు) ఖాతాల్లో కూడా రూ.124.23 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకున్న రైతులందరి ఖాతాలలో నిధులు జమ చేశామన్నారు.
“జనవరి నెల నుండి జూన్ 16 వరకు పాసుపుస్తకాలు అందిన రైతులు సంబంధిత ఏఈఓల వద్ద బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలి. వారందరి బ్యాంకు వివరాలు అందిన వెంటనే రైతుబంధు నిధులు వారి ఖాతాలలోకి జమ అవుతాయి. రైతుబంధు నిధులు జమకాని రైతుల సందేహాలు క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలి, వారి సందేహాల నివృత్తికి సహకరించాలి. రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవు, సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆలోచన. ప్రభుత్వ ప్రోత్సాహం మూలంగానే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. సీఎం కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రోత్సాహం, చిత్తశుద్దికి రైతుబంధు నిధుల జమ నిదర్శనంగా నిలుస్తుందని” మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu