తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల యొక్క వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఇంటర్ బోర్డు ప్రత్యేకమైన యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ‘టీఎస్బీఐఈ ఎం–సర్వీసెస్’ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, దానిద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో విద్యార్థులు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులంతా ఈ యాప్ ను ఉపయోగించుకుని ఒకట్రెండు రోజుల ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లి, అక్కడకు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని సిద్ధమవచ్చని తెలిపారు.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఉదయం 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను నియమించినట్టు తెలిపారు. ఈసారి మొదటి సంవత్సరం విద్యార్థులు 4,80,516 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 4,85,323 మందితో మొత్తం 9,65,839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే పరీక్షల నిర్వహణలో 25,550 మంది ఇన్విజిలేటర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఫిబ్రవరి 28, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు వివరాలు:
- ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు: మార్చ్ 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు
- పరీక్షా సమయం: ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
- మొత్తం పరీక్ష కేంద్రాలు: 1,339
- మొత్తం చీఫ్ సూపరింటెండెంట్స్: 1339
- మొత్తం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్: 1339
- పరీక్షల నిర్వహణలో పాల్గొనే ఇన్విజిలేటర్లు: 25,550
- పరీక్షకు హాజరవుతున్న మొత్తం విద్యార్థులు: 9,65,839
[subscribe]