విజయదశమి రోజున (అక్టోబర్ 5, బుధవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్/సర్వసభ్య సమావేశం యధావిధిగా జరగుతుందని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా రోజున నిర్వహించే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని, సభ్యులు అనుమానాలకు గురికావద్దని సీఎం కేసీఆర్ సూచించారు. ముందుగా ప్రకటించిన విధంగానే అక్టోబర్ 5, బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టత నిచ్చారు. పార్టీ నేతలందరూ నిర్దేశిత సమయంలోపే ఈ సమావేశానికి హాజరుకావాలని పేర్కొన్నారు.
ముందుగా అక్టోబర్ 2, ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రులు, పార్టీ కీలక నేతలు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ పూర్తి సమాచారమిచ్చారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న జాతీయపార్టీని ప్రకటించనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఈ సమావేశంలో జాతీయ పార్టీగా మార్పుపై తీర్మానం ప్రవేశపెట్టి 283 మంది టీఆర్ఎస్ సభ్యులతో ఆమోదం తెలుపనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు అధికారికంగా జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల ఈ సమావేశంపై ఎలాంటి ప్రభావం చూపదని, పార్టీ సర్వసభ్య సమావేశం యధావిధిగా జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY