ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకునేందుకు హైదరాబాద్లో ఒక్క స్మారకం కూడా లేకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ అధినేత్రి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోటస్పాండ్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలతో పాటు వైఎస్సార్టీపీ ఆవిర్భావ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. గత ఏడాది జూలై 8న షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల అనంతరం ఆమె ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి తెలుగు వారి గడపను, ప్రతి గుండెను తాకిందని పేర్కొన్నారు. ఆయన సేవలను ప్రజలు గుర్తించారని, కానీ ప్రభుత్వాలు మాత్రం గుర్తించలేకపోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ను గుర్తు చేసుకునేలా ఒక్క స్మారకం కూడా నిర్మించలేదని, దీనికోసం హైదరాబాద్లో కనీసం ఒక్క సెంటు భూమి కూడా లేదా? అని షర్మిల ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య వైఎస్ఆర్ స్మారకం కోసం స్థలం కేటాయిస్తామని ప్రకటించారని, అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు దీనిపై దృష్టి సారించలేదని షర్మిల మండిపడ్డారు.
వైఎస్ఆర్ మరణానంతరం పాలించిన కాంగ్రెస్ కానీ, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వైఎస్ సేవలను విస్మరించాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ లాంటి గొప్ప నాయకులను ఒక పార్టీకో.. ఒక ప్రాంతానికో పరిమితం చేయరాదని ఆమె సూచించారు. పార్టీ పెట్టిన కొంతకాలం తర్వాత తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మరియు బాధితులకు అండగా ఉండటం కోసమంటూ 3500 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించారు. దీనిలో భాగంగా షర్మిల ఇప్పటివరకు 116 రోజుల్లో 1500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ