వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను తిరిగి పునఃప్రారంభించనున్నారు. నర్సంపేటలో కొంతకాలం క్రితం తన కాన్వాయ్పై దాడి జరగడంతో ఆమె పాదయాత్రను మధ్యలోనే ఆపేసిన విషయం తెలిసిందే. చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేయడంతో.. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు ఆమె ప్రచార రథాన్ని దగ్ధం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు శాంతిభద్రతల సమస్య కారణంగా పాదయాత్ర కొనసాగింపుకు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసుల నిర్ణయంపై షర్మిల హైకోర్టులో పోరాడి పాదయాత్ర కొనసాగించడానికి అనుమతి పొందారు. ఈ క్రమంలోనే నేడు ఆమె పాదయాత్ర పునఃప్రారంభం అవుతోంది.
కాగా ఎక్కడైతే తన పాదయాత్ర ఆగిందో.. అక్కడినుంచే ప్రారంభిస్తానని ఇటీవలే షర్మిల ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నరావుపేట మండలం, శంకరం తండా గ్రామం నుండి 3 గంటలకు షర్మిల పాదయాత్ర మొదలుకానుంది. ఇక పాదయాత్రలో భాగంగా షర్మిల నిరుద్యోగం, రైతులు, మహిళలు, భూమి, విద్య తదితర సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగనున్నారు. అయితే దీనికిముందు షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం గవర్నర్ తో భేటీ అనంతరం నేరుగా వరంగల్కు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో ఈరోజు శంకరం తండా, లింగగిరి, సూరిపల్లి తండాల మీదుగా నెక్కొండ మండలం వరకు ఆమె పాదయాత్ర సాగనుంది. చివరిగా నెక్కొండ మండల కేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించి, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కూడా పార్టీ కసరత్తు చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE