రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 94 శాతంగా నమోదవుతోందన్నారు. వివిధ ఆసుపత్రుల్లో 15,951 చికిత్స పొందుతున్నారని, కొవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్ లో 71,186 మంది వైద్యసేవలు పొందుతున్నారని చెప్పారు.
ఏపీలో ఇప్పటివరకు 1,13,76,000 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ :
ఇక రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ లో చేసిన మార్పులకు అనుగుణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది 5 ఏళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ వేశామన్నారు. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం పకడ్బందీగా సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,13,76,000 డోసులు పంపిణీ చేశామని, 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామన్నారు. 45 ఏళ్లుకు పైబడినవారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామని చెప్పారు. ఇప్పటికి 45 ఏళ్లు పైబడిన జనాభాలో 53.07 శాతం మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. జూన్ నెలాఖారు నాటికి రాష్ట్రంలో 47,50,000 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని, ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని అన్నారు.
బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుతున్నాయి:
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తో 138 మంది మృతి చెందినట్టు ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెడుతున్నారనే ఆరోపణలు సరికాదని అన్నారు. కేసులు దాచిపెట్టడం వల్ల నష్టమే కలుగుతుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాకుండా పోతాయన్నారు. కరోనా కేసులు మాదిరిగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నాయని అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ