ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు నవంబర్ 1, సోమవారం నుంచి “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించారు. ఈ మహా పాదయాత్రను నేడు తుళ్ళూరు గ్రామంలో ప్రారంభించగా, 47 రోజులపాటుగా డిసెంబర్ 17 వరకు కొనసాగించి తిరుమలలో ముగించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. అమరావతి రైతుల పాదయాత్రకు అధికార వైఎస్సార్సీపీ మినహా, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటుగా పలు రాజకీయ పార్టీలు, పలు ప్రజా, రైతు సంఘాలు తమ మద్ధతును ప్రకటించాయి.
పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో భారీగా రైతులు, మహిళలు, టీడీపీ నేతలు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర కోసం అమరావతి పరిరక్షణ సమితి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. యాత్ర ప్రణాళికకు అనుగుణంగా జరిగేలా కమిటీలు వేసి, బాధ్యుల్ని నియమించారు. యాత్రలో పాల్గొనే వారి జాబితాను పోలీసులకు అందించడంతో పాటుగా, ప్రతి ఒక్కరికీ ఐడి కార్డులు ఇచ్చారు. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో జరిగే ఈ పాదయాత్ర రోజుకు 14 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా గుంటూరు జిల్లాలో రైతుల పాదయాత్ర 6 రోజులపాటు కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ