ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కు సంబంధించి నవయుగ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టు రద్దుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ పద్దతిలో తాజా టెండర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్ రికవరీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆశా వర్కర్ల వేతనం పెంపునకు కూడ ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుండి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మంత్రి వర్గ సమావేశంలో కొత్త ఇసుక విధానం, ఆర్టీసీ విలీనం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రాజధాని అమరావతి నిర్మాణం ఇతర అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుపుతున్నారు. మరో వైపు మచిలీపట్టణం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మంత్రి వర్గం అంగీకారం తెలిపింది. ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని, కనీసం లీజు కూడ చెల్లించలేదని పరిశ్రమ శాఖ అధికారులు ఈ సమావేశంలో వివరించారు. వీటితో పాటు మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
[subscribe]
[youtube_video videoid=APggLv2rilA]