ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు భారీవర్షాలతో అతలాకుతలమయ్యాయి. వరదలతో కొన్ని చోట్ల ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు సహాయం అందించడంపై సీఎం వైఎస్ జగన్ అధికారులుకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వరద బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలుతో పాటుగా రూ.2వేలు ఆర్ధిక సహాయాన్ని అందించాలని చెప్పారు. ప్రతి గ్రామాన్ని, వార్డును యూనిట్గా తీసుకుని, వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందేలా చూడాలన్నారు.
వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం :
మరోవైపు ఈ విపత్తు సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలని సీఎం చెప్పారు. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, అలాగే ఆర్టీసీ కండక్టర్ కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల పరిహారం అందించాలని సూచించారు. అదేవిధంగా వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక భారీ వర్షాలతో ప్రభావితమైన కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం ఒక్కో జిల్లాకు మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.40 కోట్లను వెంటనే విడుదల చేస్తున్నామని, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ