ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుండి 15 రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అలాగే మొత్తం 28.32 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి నేడే శ్రీకారం చుట్టారు. ముందుగా ఈ పథకం ప్రారంభోత్సవానికి సంబంధించి కొమరగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్ను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అలాగే కొమరగిరిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నిర్మించిన మోడల్ హౌస్ను కూడా సీఎం పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నానని పేర్కొన్నారు. 30 లక్షల మందికి పైగా పేదలకు సొంతింటి కల నిజం చేశామని అన్నారు. ఇల్లు స్థలం సైజు గతంలో 224 చదరపు అడుగులు ఉండగా 340 చదరపు అడుగులకు పెంచామన్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని, కోర్టులో నమోదైన అడ్డంకులు తొలిగాక లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. పట్టాల పంపిణి ద్వారా చేపట్టే ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలో కోటి మందికిపైగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 17వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రాబోతున్నాయని, కొత్తగా ఏర్పడే కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్క్లు, కమ్యూనిటీహాల్స్, విలేజ్ క్లీనిక్లు, అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ