మంగళవారం రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలపై వారం పాటు సస్పెన్షన్ వేటు పడింది. వారితోపాటుగా మరో 16 మంది విపక్ష ఎంపీలను కూడా సభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు లోక్సభ ఎంపీలను మొత్తం పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), సీపీఐ, టీఆర్ఎస్లకు చెందిన మొత్తం 19 మంది రాజ్యసభ ఎంపీలు కార్యకలాపాలకు అడ్డుపడుతున్నందున వారిని సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.
జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని కోరుతూ ప్రతిపక్షాల పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో వారు వెల్ లోకి వెళ్లి నిరసన తెలియజేయడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ ఎంపీలు సుస్మితా దేవ్, డాక్టర్ సంతనూ సేన్, డోలా సేన్ మరియు కాంగ్రెస్, డీఎంకే సభ్యులపై కూడా వారం పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్కు గురైన విపక్ష ఎంపీలు సభ నుంచి బయటకు రాకపోవడంతో పాటు నిరసన కొనసాగించడంతో రాజ్యసభ కార్యకలాపాలు దాదాపు ఓకే గంట పాటు వాయిదా పడ్డాయి. కాగా ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ