ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. అలాగే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఫార్మాసిటీలోని లారస్ కంపెనీకి చెందిన మూడో యూనిట్లో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ఐదుగురు కార్మికులు దానికి సమీపంలోని చాంబర్లో ఉన్నారు. అయితే వారు తప్పించుకునే వీలు లేకపోవడంతో మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే షీలా నగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీరిని రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావులుగా గుర్తించారు.
ఇక ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు ఫార్మాసిటీకి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. మాన్యుఫ్యాక్చరింగ్ బ్లాక్ ప్లాష్ ఫైర్ డ్రయర్ రూంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. షార్ట్ షర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాధమిక అంచనాకు వచ్చారు. కాగా పరవాడ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రమాదం జరిగిన తీరుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్, ఆ మొత్తాన్ని అందజేయాల్సిందిగా మంత్రి అమరనాథ్ మరియు జిల్లా కలెక్టర్కు ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE