తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమయిందా అంటే.. ఆల్ మోస్ట్ ఖాయమయిందనే మాట వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో పొత్తులపై కీలకంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ అమిత్ షా ప్రకటించడంతో.. పొత్తు ఖాయమయిందనే మాట బలంగా వినిపిస్తోంది. త్వరలోనే అధికారికంగా పొత్తుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మొన్నటి వరకు కొందరు నేతలు టికెట్ దక్కక.. సరైన ప్రాధాన్యత లేక టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కూడా కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు.
ఇదే కోవలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టీడీపీకి రాజీనామా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానాకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రదేవ్ ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. అధికారం కోసం ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు రాసిన లేఖలో చంద్రదేవ్ పేర్కొన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన అన్నారు.
కేవలం బీజేపీతో టీడీపీ చర్చలు జరపడాన్ని వ్యతిరేకిస్తూనే చంద్రదేవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముంగిట చంద్రదేవ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇది టీడీపీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో వైరిచర్ల చంద్రదేవ్ తెలుగు దేశం తరుపున అరకు నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు, టీడీపీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఢిల్లీలోనే ఉంటున్నారు.
మరోవైపు ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ నుంచి కూడా అవే సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ కూటమిలో బీజేపీ చేరితే.. ఒంటరిగా జగన్ కూటమిని ఎదుర్కోగలరా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE