ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వరదల కారణంగా పెన్నా బ్యారేజీ పనులు నాలుగు నెలలుగా ఆలస్యమయ్యాయన్నారు. పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, చాలావరకు వర్క్ కంప్లీట్ అయిందని, ఏప్రిల్ నెల చివరి నాటికి మిగిలిన పనులు కూడా పూర్తి అవుతాయని వెల్లడించారు. వీలైనంత త్వరగా బ్యారేజీని పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెప్పారు.
అలాగే సంగం బ్యారేజ్కు ‘గౌతం రెడ్డి సంగం బ్యారేజ్’ గా నామకరణం చేయనున్నామని, సీఎం జగన్ దీనిని ప్రారంభించిన అనంతరం జాతికి అంకితం చేస్తారని తెలిపారు. ఈ రెండు బ్యారేజ్లు త్వరితగతిన పూర్తిచేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారని, అందుకే పనుల పురోగతి తెలుసుకోవడానికి బ్యారేజ్ సందర్శించానని మంత్రి చెప్పారు. ఒక్కసారి ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే నెల్లూరు జిల్లాలో సాగు నీరు, త్రాగు నీరు సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. నగర నియోజకవర్గంలో రెండేళ్లలో 350 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టిందని, రెండేళ్లలో పాక్షికంగానే పనులు చేసిందని విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ