తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు) జనవరి 16, బుధవారం నాడు సమావేశం కానున్నారు. జనవరి 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎంలిద్దరూ తీసుకున్న నిర్ణయం మేరకే సీఎస్ల భేటీ జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎస్ల భేటీ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కొన్ని కీలక శాఖల ఉన్నతాధికారులతో కలిసి విజయవాడ వస్తున్నారు. అలాగే ఏపీ సీఎస్ నీలం సాహ్నితో పాటుగా ఏపీ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా 9, 10 షెడ్యూల్లోని సంస్థల యొక్క ఆస్తుల విభజనపై చర్చించనున్నారు. వీటితో పాటుగా విద్యుత్ ఉద్యోగుల విభజన, ఉద్యోగుల అంతర రాష్ట్ర బదిలీలు, తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. సీఎంల సమావేశంలో చర్చించిన పలు అంశాలను ఈ భేటీలో మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
[subscribe]