జనవరి 16, గురువారం నాడు జనసేన, బీజేపీకి చెందిన కీలక నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకులతో చర్చించిన అనంతరం, ఇకపై బీజేపీతో కలిసి పనిచేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హోటల్ మురళీ ఫార్చ్యూన్లోనే ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. జనసేన తరఫున అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు హాజరవ్వగా, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సోము వీర్రాజు, మరికొంతమంది నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల దృష్ట్యా ఏఏ అంశాలపై కలిసిపోరాటం చేయాలి, ఏ రకంగా కలిసి ముందుకెళ్లాలనే విషయాలను ఇరు పార్టీల నేతలు చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశం, అమరావతి రైతుల ఆందోళనలు, ఇతర ప్రజా సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి ముందుగా జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. బీజేపీతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఆలోచనలు పంచుకున్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యి జనసేన పార్టీతో జరిగే భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏఏ అంశాల అజెండాగా ముందుకు వెళ్లాలి అనే దానిపై పార్టీ నేతలతో చర్చించామని, భేటీ అనంతరం ఇరుపార్టీలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.
[subscribe]