ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 మరియు గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వారు కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ (సీపీటీ) పాస్ కావాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏపీపీఎస్సీ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ పాస్ కావాల్సిందే. కాగా 100 మార్కులకి నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంది. అలాగే బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఇక ఈ సర్టిఫికెట్ పొందిన వారే నియామకాలకు అర్హులని, సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా నియామకానికి అవకాశం లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అయితే గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలకు ఈ నిబంధన వర్తించదని నిబంధనల్లో తెలిపారు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ మొత్తం డిజిటల్ ఆధారితంగానే జరుగుతోన్న నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల్లో నియమితులయ్యే అభ్యర్థులకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని భావించిన ఏపీ ప్రభుత్వం, ఈ మేరకు కొత్త రూల్స్ రూపొందించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే సీపీటీ పరీక్షలో.. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్, బేసిక్ కంప్యూటింగ్, ఇంటర్నెట్, విండోస్ ఆఫీస్ టూల్స్ నిర్వహణ, డాక్యుమెంటేషన్ తదితర అంశాలపైనా అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE