ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు మార్చ్ 24 , మంగళవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31 తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకునట్టుగా తెలుస్తుంది.
రాష్ట్రంలో ఇప్పుటికే 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చ్ 31వ తేదీ వరకు రాష్ట్రాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లు రెండ్రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. అత్యవసర సేవలు మినహా, మిగతా అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే 10వ తరగతి పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగించాలని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి సమీక్ష నిర్వహించి, పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా