ఏపీలో ఫిరాయింపులు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ పెద్ద ఎత్తున నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో.. ప్రధానపార్టీల్లోని సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరారు. అటు టీడీపీని కూడా కొందరు నేతలు వీడి వైసీపీలో చేరిపోయారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆపార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటపడుతున్నారు. ఈక్రమంలో టీడీపీలో మరో బిగ్ వికెట్ పడనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోనసీమ జిల్లాలో సూర్యారావుకు మంచి బలం.. బలగం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యారావు టీడీపీ తరుపున రాజోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా రాజోల్ టికెట్ టీడీపీ సూర్యారావుకే ఇచ్చింది. కానీ ఈసారి సూర్యారావు.. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు.
అప్పటి నుంచి సూర్యారావు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో.. తిరిగి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాజోల్ టికెట్ ఆయన ఆశిస్తున్నారు. తనకు కాకపోయినా.. తన కూతురికి అయినా టికెట్ ఇప్పించుకోవాలని సూర్యారావు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ హైకమాండ్ మాత్రం ఈసారి సూర్యారావుకు గానీ.. ఆయన కూతురికి గానీ టికెట్ ఇచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ క్లియర్ కట్గా సూర్యారావుకు చెప్పేసిందట. ఈసారి టికెట్ ఇవ్వడం సాధ్యపడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందట.
ఈక్రమంలో గొల్లపల్లి సూర్యారావు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే ఆయన వైసీపీ హైకమాండ్తో చర్చలు జరిపారట. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారట. త్వరలోనే ఆయన తాడేపల్లి వెల్లి వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారట. ఆయన సమక్షంలోనే వైసీపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY