సీనియర్లను పక్కన పెట్టేసింది.. గెలుపు గుర్రాలకే చాన్స్ అని బీజేపీ హైకమాండ్ బలగుద్ది చెప్పింది. సీనియర్లు, జూనియర్లు అన్నది ముఖ్యం కాదని.. గెలుస్తారా లేదా అన్నదన్నే పరిగణనలోకి తీసుకుంటామని అనేకసార్లు చెప్పిన బీజేపీ హైకమాండ్ చెప్పిందే చేసింది. ఏపీ బీజేపీ సీనియర్లకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ చూసిన తర్వాత ఏపీ బీజేపీ సీనియర్లు అలకబూనారు. మరోసారి ఢిల్లీ బాట పట్టారు. పార్టీలో ఎంతోకాలంగా ఉన్న కొందరు ఈ సారి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. వలస పక్షులకే బీజేపీ హైకమాండ్ పచ్చ జెండా ఊపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇంతకి లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు?
– కొత్తపల్లి గీత (అరకు)
– సీఎం రమేశ్ (అనకాపల్లి)
– డి. పురందేశ్వరి (రాజమహేంద్రవరం)
– భూపతిరాజు శ్రీనివాసవర్మ ( నరసాపురం)
. వరప్రసాద రావు (తిరుపతి)
. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి (రాజంపేట)
మాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు?
ఏపీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ మూడు పార్టీల పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. ఇందులో ఆరుగురు ఎంపీ స్థానాలకు పోటి చేసే వారి లిస్ట్ రిలీజైన దగ్గర నుంచి సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్రెడ్డిలకు సీట్లు దక్కకపోవడం షాక్కు గురి చేసింది. జీవీఎల్ వైజాగ్ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. అటు రాజమండ్రి నుంచి ఏపీ మాజీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు టికెట్ అడిగారు. అయితే ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి బీజేపీ హైకమాండ్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా టికెట్ కన్ఫమ్ చేసింది. దీంతో ఇప్పుడు సోము పరిస్థితి ఏంటన్నదానిపై ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది. ఇటీవలే సీనియర్లంతా బీజేపీ హైకమాండ్కు లేఖలు రాశారు. తమను పట్టించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా బీజేపీ పెద్దలు పురందేశ్వరి వర్గానికే సీట్లు కేటాయిందన్న ఆరోపణలు సీనియర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ఫ్రెండ్స్కు టికెట్లా?
హిందూపురం నుంచి పరిపూర్ణానంద పోటీ చేస్తారనే ప్రచారం జరగగా.. అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. ఇలా అటు బీజేపీ, ఇటు టీడీపీ కలిపి సీనియర్లతో ఆడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా పొత్తులో భాగమేనని.. గెలిచే వారికి సీట్లు ఇస్తాం కానీ సీనియర్ల అనే కారణంతో సీటు ఇవ్వడం కుదరదని బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే లిస్ట్లో ఉన్నవాళ్లలో వరప్రసాద రావు కూడా ఉండడం సీనియర్లను బాధ పెడుతోంది. ఆయన నిన్నటికి నిన్న(మార్చి 24) వైసీపీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్రావకు పార్టీలో చేరిన సాయంత్రానికే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు. పార్టీకి సేవ చేసిన వారికి కాకుండా వలస వచ్చిన అవకాశవాదులకు టికెట్లు ఇస్తారా అని వాపోతున్నారట సీనియర్లు. ఇక లిస్ట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్ పేరు కూడా ఉంది. ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. సీఎం రమేశ్ గతంలో టీడీపీలో ఉన్నారు. ఇలా తన స్నేహితులకు చంద్రబాబుకు టికెట్ ఇప్పించుకున్నారని.. హిందూత్వ భావజాలంతో, బీజేపీ సిద్ధాంతాన్ని మోస్తున్న తమను పట్టించుకోలేదని సీనియర్లు హైకమాండ్ దగ్గర తమ మొరను వినిపించుకునేందుకు సిద్ధమయ్యాని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేలోపు ఢిల్లీలో సీనియర్లు వాలిపోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY