కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ పార్టీ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మోకా భాస్కర్ రావును సోమవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. మున్సిపల్ చేపల మార్కెట్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా, ఘటనలో తీవ్రంగా గాయపడిన మోకా భాస్కర్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి మోకా భాస్కర్ రావు ముఖ్య అనుచరుడు. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కాగా తన అనుచరుడు మోకా భాస్కర్రావు మృతదేహానికి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్రావు మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి లోనయి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భాస్కర్రావు కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. మరోవైపు భాస్కర్రావు హత్యకు గురవడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu