కాపు ఉద్యమనేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. ఆమధ్య త్వరలోనే ముద్రగడ జనసేనలో చేరబోతున్నారంటూ హడావుడి జరిగింది. ముద్రగడ పద్మనాభంతో పాటు, ఆయన కుమారుడు ముద్రగడ గిరికి కూడా రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనే కండిషన్ పెట్టి మరీ ముద్రగడ జనసేనలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
దీనికి తగినట్లే పవన్ కూడా అప్పుడు సానుకూలంగానే స్పందించారు. ఆ సమయంలో తాను టీడీపీలోకి, వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ముద్రగడ కూడా తెగేసి చెప్పారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఇక రేపోమాపో ముద్రగడ జనసేన కండువా కప్పుకోడం ఖాయమని, దీనిపై అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అని అంతా భావించారు.
కానీ అంతకు మించి ముద్రగడ విషయంలో ఒక్క అడుగు కూడా పడలేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. కానీ ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కలవలేదు . దీంతోనే ముద్రగడ పద్మనాభం జనసేనానిపై పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి దుందుడుకు స్వభావం ఉండటంతోనే ముద్రగడను చేర్చుకునే విషయంలో పవన్ అంత సానుకూలంగా లేరన్న వాదన వినిపిస్తోంది. తమ పార్టీలో చేర్చుకుంటే రాబోయే రోజుల్లో ఆయన పెట్టే డిమాండ్లు పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయని పవన్ అభిప్రాయపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ముందుగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారని అంతా భావించారు. కాకపోతే ముద్రగడతో పాటు ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే విషయంలో జగన్ అంత సానుకూలత చూపించలేదు. దీంతో ఆ పార్టీపై ఆగ్రహంతో జనసేనలో చేరడానికి ముద్రగడ నిర్ణయించుకున్నారు.కానీ ఇప్పుడు పవన్ కూడా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో ముద్రగడ మరోసారి డైలమాలో పడ్డారు. తాజాగా టీడీపీతో జనసేన పొత్తు కొనసాగిస్తుండటంతో.. ముద్రగడను జనసేనలో చేర్చుకునే విషయంలో టీడీపీ నుంచి కూడా పవన్కు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. దీంతనే పవన్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE