ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక చర్యకు పూనుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం దీనిని ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్పై తాను చేసిన ఆరోపణలపై ఇంతవరకూ ప్రభుత్వం వివరణ ఇవ్వలేదని, దీనిపై తాను కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని వెల్లడించారు. ఈ విషయంలో ఎక్కడిదాకా అయినా వెళ్తానని, వెనుకడుగు వేసేది లేదని, అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తాను ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ నేతలు కూడా సరైన రీతిలో మాట్లాడాలని, అంతేకానీ తనపై శాపనార్దాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్లో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించానని, అయితే చాలాకాలంగా కోరుతున్నా రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు. పొదలకురు రోడ్డులో 3 కిలోమీటర్లు ఒక పక్కే వేయడంతో ఆ దారిలో ప్రయాణిస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని తాను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీసుకెళ్లి చూపించి పరిస్థితిని వివరించానని, ఆయన రూ.28 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారని, కానీ నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని కోటంరెడ్డి తెలిపారు.
ఇంకా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. అలాగే తన నియోజకవర్గ పరిధిలో ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠశాల పూర్తి కాలేదని, వావిలేటుపాడులో 3 వేల మందికి ఇచ్చిన ఇళ్లకు సంబంధించిన సమస్యలు నెలలు గడుస్తున్నా పరిష్కారం కాలేదని అన్నారు. ఇక దర్గామిట్టలోని బీసీ భవన్, అంబేడ్కర్ భవన్, లైబ్రరీ నిర్మాణాలు నిధులు లేక నిలిచిపోయాయని, గణేష్ ఘాట్ అభివృద్ధి కోసం కేంద్రం రూ.15 కోట్ల 20 లక్షలు నిధులు విడుదల చేసినా.. సంబంధిత శాఖల అధికారుల సహకారం లేక పనులు జరగడం లేదని ఆయన తెలిపారు. 30 లక్షల మందితో కుల,మతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ ప్రాంతంలో ఏర్పాట్లు కోసం రూ.15 కోట్లు అడిగితే సీఎం జగన్ జీవో ఇచ్చారని, ఇంత వరకూ ఆ నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఇక 15 నెలల అధికారాన్ని వదులుకోవడానికి సిద్దమయ్యానని, వేధింపులు ఉంటాయని తెలుసనీ, అన్నింటికి తెగించిన వాళ్లే నాతో ఉంటారని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE