ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ గెలుపుపై ఇప్పుడు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓటమి పాలుకావడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి.. గత చేదు ఫలితాలను చెరిపేసుకునే పనిలో పవన్ ఉన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రమంతా కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తూనే, తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పవర్ స్టార్ పవర్ కల్యాణ్. ఆయన నామినేషన్ వేసే రోజునే తన బలం, అభిమానబలగం చాటి చెప్పేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ నెల 23న నామినేషన్ వేయనున్నట్లు ఇప్పటికే ముహూర్తం నిర్ణయించారు. అంతకు ముందే పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. రోజుకి కనీసం రెండు సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 20న పిఠాపురం, రాజానగరం బహిరంగ సభ లో పవన్ పాల్గొంటారు. 21న భీమవరం, నరసాపురంలో పవన్ ప్రచార సభలకు ముహూర్తం నిర్ణయించారు. ప్రచార షెడ్యూల్ అదే విధంగా.. 22న తాడేపల్లెగూడెం, ఉంగుటూరులో పవన్ ప్రచారం చేయనున్నారు. 23న పిఠాపురంలో నామినేషన్ వేసిన అనంతరం ఉప్పాడలో బహిరంగ సభ నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
నామినేషన్ కు భారీ స్థాయిలో జనసమీకరణ చేసేందుకు పిఠాపురంలో కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో పలుదఫాలు ఇప్పటికే నేతలు సమావేశమయ్యారు. నామినేషన్ పర్వంపై చర్చించారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టిన పవన్.. ఆరోజు కూడా పూజలు చేసి నామినేషన్ వేసేందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అట్టహాసంగా కార్యక్రమం చేపట్టేందుకు కావాల్సిన అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో వారాహి ప్రచారానికి నిరాకరించిన స్థానిక అధికారులు.. నామినేషన్ రోజు ప్రచారంపై ఎటువంటి ఆంక్షలు పెడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY