ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన పూతలపట్టులో ఈ సారి రసవత్తర పోరు జరగనుంది. టీడీపీ, వైఎస్పార్సీపీల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరూ కూడా నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి డాక్టర్ వృత్తిని కొనసాగిస్తున్న సునీల్ కుమార్ బరిలో ఉండగా.. టీడీపీ నుంచి జర్నలిస్ట్ అయిన డాక్టర్ కలికిరి మురళీమోహన్ పోటీ పడుతున్నారు. జర్నలిస్ట్ కావడంతో కలికిరి మురళీ మోహన్కు క్షేత్రస్థాయిలో రాజకీయాలలో మంచి పట్టుంది. అలాగే ప్రజల నాడి, ప్రజా సమస్యలపై కూడా అవగాహన బాగా ఉంది.
ఇక 2009 నుంచి పూతలపట్టులో ఎన్నికలు జరుగుతుండగా.. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పి.రవి గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్.సునీల్ కుమార్.. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆయనపై చాలా ఆరోపణలు రావడంతో.. వైఎస్సార్సీపీ కేడర్ నుంచి సునీల్ కుమార్కు సహకారం లభించలేదు. అందుకే 2019లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్.సునీల్ కుమార్ను పక్కన పెట్టి… ఎంఎస్ బాబుకు జగన్ అవకాశం ఇవ్వగా..ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబు విజయాన్ని సాధించారు.
తాజాగా మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీ అధినేత జగన్..గత ఎన్నికలలో పక్కన పెట్టిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ను పిలిచి మరీ అవకాశమిచ్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్బాబు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అయితే ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నా కూడా ఆయన గతంలో ఆ ప్రాంతానికి చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత పెరిగిపోయిందని..దీంతో ప్రధాన పోరంతా టీడీపీ,వైసీపీల మధ్యే ఉందని తెలుస్తోంది. అక్కడ దళిత ఓటర్లే కీలకం అని.. 50 నుంచి 55 శాతం మంది దళిత ఓటర్లు ఉంటారని తెలుస్తోంది. వీరిలో కూడా… అరవ మాల సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. అరవమాల ఓటర్ల సంఖ్య 30 నుంచి 35 శాతం ఉంటుందని అంచనా.
రాష్ట్ర విభజన ముందు జరిగిన ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు గెలిపించారు. విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కూడా అంటే 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండానే ఎగిరింది. అలా ఈ మూడు ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో.. నాలుగోసారి అయినా టీడీపీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని పెట్టుకున్నారు చంద్రబాబు. బీజేపీ, జనసేన దన్ను ఉండటంతో విజయం దక్కించుకోవడం ఖాయమనే ధీమాతో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY