ఏపీలో రాజకీయ నాయకులు కాక రేపుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ మారుతూ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. కోరుకున్న చోట టికెట్ ఇవ్వలేదని సొంత పార్టీలకే పంగనామాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు క్షణాల్లో పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ, టీడీపీలకు కొందరు నేతలు రాజీనామా చేశారు. అటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని శ్రీకృష్ణదేవరాయలుకు హైకమాండ్ సూచించింది. కానీ అక్కడి నుంచి పోటీ చేయడం ఇష్టంలేక ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.
ఇప్పుడు మరో ఎంపీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీనివాసులురెడ్డికి వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది. కనీసం తన కొడుక్కి అయినా ఈసారి టికెట్ ఇవ్వాలని మాగుంట కోరారు. కానీ హైకమాండ్ అందుకు నిరాకరించింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన కార్యాలయంలోని వైసీపీ జెండాలను కూడా మాగుంట తొలగించారు.
బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్లుగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని మాగుంట పేర్కొన్నారు. తమ కుటుంబానికి అహం లేదు కానీ ఆత్మగౌరవం ఉందన్న మాగుంట.. పలు అనివార్య కారణాలవల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీని వీడడం బాధాకరమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీని వీడడం తప్పడం లేదని మాగుంట పేర్కొన్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారని.. ఆయనకు ధన్యవాదాలు అని మాగుంట వివరించారు.
ఈ సందర్భంగా మరో సంచలన విషయాన్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించామని.. ఇది తమ కుటుంబ నిర్ణయమని వివరించారు. మరోసారి తమ కుటుంబాన్ని ఆదరించమని ప్రకాశం జిల్లా వాసులందరిని కోరుతున్నట్లు మాగుంట వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE