తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దబాటుపై ఓ క్లారిటీ వచ్చేసింది. జనసేన 40కి పైగా అసెంబ్లీ స్థానాలు కోరినప్పటికీ.. చివరికి 24 స్థానాలతో సర్దిపెట్టుకుంది. అలాగే 3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా జనసేన-టీడీపీ కూటమితో దోస్తీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కేవలం సీట్ల సర్దుబాటు వద్దే బీజేపీ పునరాలోచన చేస్తోందట. 20కిపైగా అసెంబ్లీ స్థానాలు.. 10 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని బీజేపీ పెద్దలు కోరుతున్నారట. కానీ చంద్రబాబు మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాయి. ఆ సమయంలో విజయం సాధించాయి. అయితే ఆ ఎన్నికలవేళ బీజేపీకి చంద్రబాబు నాయుడు ముందు 15 అసెంబ్లీ.. 6 ఎంపీ సీట్లు ఇస్తామని అన్నారు. కానీ చివరికి వచ్చే సరికి కేవలం 12 అసెంబ్లీ.. 4 పార్లమెంట్ స్థానాలను మాత్రమే ఇచ్చారు. ఈసారి కూడా అలానే తక్కువ సీట్లను బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. పొత్తులో గెలిచినా.. ఒంటరిగా గెలిచినా మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలను తమ అభ్యర్థులే గెలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.
అందుకే సీట్ల సర్దబాటు విషయంలో ఆచితూచి చంద్రబాబు అడుగులేస్తున్నారట. ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఈక్రమంలో బీజేపీకి ఇంకా తక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పదికంటే తక్కువ అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి 12 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన చంద్రబాబు ఈసారి.. కేవలం 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నారట. అలాగే మరో 4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని భావిస్తున్నారట.
కేవలం 4 స్థానాలే ఇస్తుండడంతో బీజేపీ పెద్దలు పునరాలోచన చేస్తున్నారట. అసెంబ్లీ స్థానాల విషయంలో తగ్గినప్పటికీ.. లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ఏమాత్రం తగ్గడం లేదట. 8 నుంచి 10 స్థానాలు ఇచ్చి తీరాల్సిందేనని పట్టబడుతున్నారట. ఒకవేళ చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గకపోతే ఒంటరిగా అయినా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ పరిణామాల మధ్య బీజేపీ అడిగినన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE