బాధితులకి న్యాయం చేయాలని ప్రశ్నిస్తే, నోటీసులిస్తారా? అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక మానసిక వికలాంగురాలిని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్భందించి, సామూహిక అత్యాచారం చేశారని తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారని బోండా ఉమ అన్నారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతోందని, నిన్నటివరకూ ప్రభుత్వం తరపున బాధితురాలికి సాయం చేసేందుకు ముందుకు రాలేదని మండిపడ్డారు. నిన్న ఉదయం మాజీ సీఎం చంద్రబాబు బాధితురాలిని పరామర్శించడానికి వస్తున్నారని తెలిసిన వెంటనే ప్రభుత్వంలో అలజడి మొదలైందని, తప్పుని సరిదిద్దుకోవడానికి వెంటనే అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిందని చెప్పారు.
అసలు ఈ ఘటన జరగడానికి పోలీసుల వైఫల్యమే కారణమని, కానీ వారిపై చర్యలు తీసుకోవడానికి 2 రోజులు పట్టిందని బోండా ఉమా విమర్శించారు. చంద్రబాబు వచ్చేవరకూ బాధితురాలిని ఎవరూ పట్టించుకోలేదని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా అదే సమయంలో వచ్చారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలతో పాటు, బాధితురాలి తరపు బంధువులు కూడా అక్కడ ఉన్నారని.. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పరామర్శకు వచ్చారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇందులో చంద్రబాబు తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు సిఎం కానీ, హోంమంత్రి కానీ బాధితురాలిని పరామర్శించటానికి రాలేదని ఉమా గుర్తుచేశారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా బాధితులకి న్యాయం చేయమని అడిగామని, బాధ్యులపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేశామని.. దీనికే నోటీసులు జారీ చేసారని పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై ఎలాంటి దాడి చేయలేదని బోండా ఉమా స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ