తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు (జూలై 11, సోమవారం) తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి/ట్రస్ట్బోర్డు సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, తుడా ఛైర్మన్ మరియు టీటీడీ ఎక్స్ అఫీషియో సి.భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు, జెఇఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎండోమెంట్స్ కమీషనర్ హరి జవహర్లాల్, తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 మధ్య నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండేళ్ల విరామం తర్వాత భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణలను సడలించి నేపథ్యంలో ఈ ఏడాది తొమ్మిది రోజుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, మాడ వీధుల్లో వాహన సేవల ఊరేగింపును నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబరు 27 బ్రహ్మోత్సవాల మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 5న చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు:
- ఆగస్టు 16 నుంచి 20 వరకు నెల్లూరు జిల్లాలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు పునఃప్రారంభం
- సర్వదర్శనం టోకెన్ల జారీపై కీలక చర్చ, భవిష్యత్తులో టోకెన్లు మరియు దర్శనం కోసం చాలా గంటలు వేచి ఉండే అసౌకర్యాన్ని నివారించడానికి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పునఃప్రారంభించబడుతుందని తెలిపారు
- శ్రీ పద్మావతి పీడియాట్రిక్ హాస్పిటల్ నిర్మాణానికి రూ.154.50 కోట్లతో సివిల్ వర్క్స్ టెండర్లకు బోర్డు ఆమోదం
- తిరుమలలోని పారువేట మండపాన్ని రూ.2.07 కోట్లతో పునర్నిర్మించనున్నారు
- అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రంలో పచ్చదనం, పూల తోటలను రూ.2.90కోట్లతో అభివృద్ధి
- పది నెలల కాలానికి ఎస్వీ గోశాలలో పశువులకు రూ.7.32 కోట్ల మేత కొనుగోలు
- శ్రీ బేడి ఆంజనేయుడికి రూ.18.75 కోట్లతో రాగి కవచంపై బంగారు పూత
- తిరువాయూర్లో డాక్టర్ పర్వతం మరియు తమిళనాడులోని ఉత్తండి డొనేట్ చేసిన రూ. 6కోట్ల విలువైన ఆస్తులు, అలాగే బెంగళూరులో డాక్టర్ రామనాథ్ వి గుహచే డొనేట్ చేసిన 3080 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను టీటీడీ స్వాధీనం చేసుకుంది
- స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ.4.42 కోట్లతో ఐటీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి
- తిరుమలలో రూ.7 కోట్లతో పెండింగ్లో ఉన్న ఆక్టోపస్ బేస్ క్యాంపు పనులను పూర్తి చేసేందుకు ఆమోదం
- పరిశుభ్రమైన వాతావరణంలో ఆటోమేటిక్గా బూందీని తయారు చేసేందుకు సరికొత్త అత్యాధునిక పరికరాలతో (ఆస్ట్రేలియా మరియు స్విట్జర్లాండ్ నుండి) పోటు యాంత్రీకరణను అధ్యయనం చేయడం
- తిరుమలలో 638 మంది విద్యార్థులు చదువుతున్న ఎస్వీ హైస్కూల్ను సింఘానియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహాయంతో మోడల్ స్కూల్గా అభివృద్ధి
- టీటీడీ 2023 సంవత్సరానికి వివిధ రకాల డైరీలు మరియు క్యాలెండర్ల 33 లక్షల కాపీలు మరియు సప్తగిరి పత్రిక యొక్క 2.10 లక్షల కాపీలను ఐదు భాషలలో ప్రతి నెలా ముద్రించనుంది
- శ్రీవారి ప్రసాదాల తయారీకి సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయబడిన డజను సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆమోదం
- ఆగమ పండితుల సూచన మేరకు ఆనంద నిలయం విమానం గోల్డ్ మాలం పనులు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY