దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. “ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. అర్హులైన వారందరూ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాం” అని ప్రకాశ్ జవడేకర్ పేర్కొన్నారు.
ముందుగా జనవరి 16 న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయింది. అందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని హెల్త్కేర్ వర్కర్లకు, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మొదటి, రెండవ డోసు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఇక రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో వ్యక్తికీ ఒక్కో డోసుకు ధరను రూ.250గా నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ