దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 2.46 శాతంగా ఉన్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ దేశాలన్నింటిలో కంటే అతి తక్కువ మరణాల రేటు భారత్ లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. తీవ్రమైన కరోనా కేసులతో పాటుగా, ఓ మాదిరి తీవ్రత కలిగిన కేసులకు కూడా ప్రామాణికమైన, సమర్థవంతమైన చికిత్సను దేశంలో అందించడం వలనే కరోనా రోగులలో అధిక రికవరీ రేటును సాధించడానికి దోహదపడుతుందని చెప్పారు.
కరోనా మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కోవడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు తగిన చేయూతనిస్తూ సహకరిస్తోంది. అందులో భాగంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ లో ఈ-ఐ.సి.యు కార్యక్రమం అమలు చేస్తుంది. కరోనా మరణాలను తగ్గించే లక్ష్యంతో 11 రాష్ట్రాల్లోని 43 పెద్ద ఆసుపత్రులకు ఐ.సి.యు. రోగుల క్లినికల్ మేనేజ్మెంట్లో భాగస్వామ్య అనుభవాలను, దేశీయ నిపుణుల సాంకేతిక సలహాలను ఎయిమ్స్ అందజేస్తుంది.
మరోవైపు ఇప్పటికి దేశంలో 7 లక్షలకు పైగా కరోనా బాధితులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. గత 24 గంటల్లో 22,664 మంది కోలుకోగా, కరోనా రికవరీ రేటు 62.62 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,90,459 కరోనా బాధితులు ఆసుపత్రులలో లేదా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu