గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఘనవిజయం సాధించింది. ఈ మేరకు బుధవారం ఎంసీడీ హౌస్ మీటింగ్లో నిర్వహించిన ఓటింగ్లో ‘ఆప్’కి చెందిన షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లు దక్కించుకోగా, బీజేపీకి చెందిన రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్లతో విజయం సాధించినట్లయింది. కాగా ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్శిటీలో మాజీ విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మొదటిసారి కౌన్సిలర్గా ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ ఆదేశ్ గుప్తా స్వస్థలమైన తూర్పు పటేల్ నగర్ నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
ఇక ఈ సందర్భంగా సభలో షెల్లీ ఒబెరాయ్ మొదటిసారి ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు లెఫ్టినెంట్ గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ చట్టం యొక్క నిబంధనలను పాటిస్తానని మరియు నియమ నిబంధనల ప్రకారం ఎంసీడీని నడుపుతానని చెప్పారు. ఈ కీలక బాధ్యతలను నెరవేర్చడానికి తనకు ఢిల్లీ ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పారు. ఢిల్లీ ప్రజల కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. మరోవైపు తమ పార్టీ అభ్యర్థి ఒబెరాయ్ విజయం సాధించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితరులు ఒబెరాయ్ మరియు పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు గెలిచారని, బీజేపీ దాదాగిరి ఓడిపోయిందని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కుపై వివాదం చెలరేగడంతో గత రెండు నెలల వ్యవధిలో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు మరియు కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి ఆల్డర్మెన్లను ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించారనే బిజెపి వాదనను సవాలు చేస్తూ ఆప్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు నామినేటెడ్ సభ్యులకు ఎన్నికల్లో ఓటు హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నిక జరిగింది. ఫలితాలు ప్రకటించిన అనంతరం ఆప్ సభ్యులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
ఇక ఈరోజు మధ్యాహ్నం మేయర్ ఎన్నిక ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఒబెరాయ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, బీజేపీకి చెందిన సత్య శర్మ నుండి బాధ్యతలు స్వీకరించారు. మేయర్గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్.. డిప్యూటీ మేయర్ మరియు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలకు అధ్యక్షత వహించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆలే మొహమ్మద్ ఇక్బాల్ను ఆప్ నామినేట్ చేయగా, బిజెపి కమల్ బాగ్రీని ఈ పదవికి ప్రతిపాదించింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. స్టాండింగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో ఆప్కి మూడు, బీజేపీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉండగా ఆరో సీటుపై పోరు నెలకొంది. ఇక 274 మంది సభ్యుల సభలో ఆప్కు 150 మంది సభ్యులు ఉండగా.. మెజారిటీ మార్క్ 138గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE