భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో కరోనా బాధితుల చికిత్స కోసం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ 2డీజీ ఔషధం ధరపై నిర్ణయం తీసుకున్నారు. 2 డీజీ ఒక్కో సాచెట్ ధరను రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఔషధాన్ని రాయితీ ధరలకు అందించనున్నట్టు తెలిపారు.
ముందుగా కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి సంబంధించి 2డీజీ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. అనంతరం మే 17 ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మొదటి బ్యాచ్ 2డీజీ ఔషధ సాచెట్లను విడుదల చేశారు. మొదటి బ్యాచ్ లో భాగంగా 10 వేల 2డీజీ ఔషధం సాచెట్లను విడుదల చేయగా, మే 27న రెండో బ్యాచ్ లో భాగంగా మరో 10వేల సాచెట్లను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఈ ఔషధం అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో పాటుగా, తీవ్రమైన కరోనా లక్షణాలున్న వారిలో కూడా ఇది సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ 2డీజీ ఔషధం కరోనా రికవరీ సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఆక్సిజన్ డిపెండెన్సీని తగ్గిస్తుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ