గుజరాత్ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మళ్ళీ సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోను అధికారిక పత్రంగా కాంగ్రెస్ స్వీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు..
- గుజరాతీలందరికీ రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం.
- రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ, వితంతువులు, వృద్ధులకు నెలకు ₹ 2,000 చొప్పున మంజూరు చేస్తాం.
- రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం.
- రాష్ట్రంలోని బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తాం.
- అలాగే ₹ 3 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాం.
- గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.
- ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలవారీ రూ. 3,000 అందిస్తాం.
- గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు రూ. 500లకే అందిస్తాం.
- గత 27 ఏళ్లలో జరిగిన అవినీతికి సంబంధించిన అన్ని ఫిర్యాదులపై విచారణకు ఆదేశించి, దోషులపై కేసులు నమోదు చేస్తాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE