అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపోరు రసవత్తరంగా సాగుతోంది. మరికొద్ది నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనుండడంతో.. ఇప్పటి నుంచే ఎన్నికల వేడి భగ్గుమంటోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం దక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సవాళ్లు.. ఎదురు దెబ్బలు ఎదురైనప్పటికీ లెక్క చేయకుండా.. గెలుపు దిశగా ముందుకు కదులుతున్నారు. గెలుపుపై ఎంతో పట్టుదలతో ఉన్న ట్రంప్కు మొదటి విజయం దక్కింది. అయోవా కాకసస్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. 51 శాతం ఓట్లతో ట్రంప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు.
అయోవా కాకసస్ ఎన్నికల్లో భారతి సంతతి వ్యక్తి వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే ముందు నుంచి ట్రంప్కు గట్టి పోటీ ఇస్తూ వస్తోన్న వివేక్ అయోవా కాకసస్ ఎన్నికల్లో 7.7 శాతం ఓట్లు మాత్రమే రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల రేసు నుంచి వైదొలిగారు. అంతేకాకుండా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్ధతు ఇస్తానని ప్రకటించేశారు. అయోవా ఎన్నికల్లో గెలుపు.. వివేక్ రామస్వామి మద్ధతు.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రేటింగ్లు తగ్గడం.. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఖాయమని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ నేతలు కూడా ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపడుతారని భావిస్తున్నారట.
అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపడితే ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇక ట్రంప్ గెలిస్తే.. భారత్తో అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయి..? అక్కడున్న ప్రవాస భారతీయుల పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ గతంలో అధికారంలోవున్న సమయంలో భారత్, అమెరికా మధ్య సుహృద్భావ వాతావరణమే ఉంది. కానీ అప్పట్లో అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ట్రంప్ పలు కఠిన ఆంక్షలు విధించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ట్రంప్ దెబ్బకు అప్పట్లో కొందరు భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చేశారు.
అయితే ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తే.. ఇంకా ఎన్ని ఆంక్షలు పెడుతారోనని అక్కడి ప్రవాస భారతీయులు అనుకుంటున్నారట. అలాగే భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య సుంకాలపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు ఆ విషయంలో ఆయన అసంతృప్తిని వెల్లగక్కారు. ఈక్రమంలో సుంకాల విషయంలో భారత్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో.. ఇప్పటికే చైనా గడగడలాడిపోతోంది. అయోవాలో ట్రంప్ గెలుపొందడంతో.. చైనా స్టాక్ మార్కెట్ పేకమేడలా కుప్పకూలిపోయింది. గతంలో ట్రంప్ అధికారంలోవున్న సమయంలో చైనా ఉత్పత్తులపై ట్రంప్ భారీగా ట్యాక్స్ విధించారు. దీంతో అప్పట్లో చైనా ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక.. ఈ విషయంలో చైనాకు కాస్త ఊరట లభించింది. ఇప్పుడు ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే వాణిజ్యం విషయాలు చైనాకు తిప్పులు తప్పవనే వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE