తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటమిపాలయిన విషయం తెలిసిందే. ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఈటల.. ఆ రెండో చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. ఇక త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుకోవాలని ఈటల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈటలకు సంబంధించి కొద్దిరోజులుగా రకారకాలుగా ఊహాగాణాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈటల పార్టీ మారుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూసింది.
ఈటల రాజేందర్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని.. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో చర్చలు జరిపారని.. రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గుసగుసలు వినిపించాయి. ఎంపీ టికెట్ ఒప్పందంతోనే ఈటల కాంగ్రెస్లోకి వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ ఈ ప్రచారంపై స్పందించి తాను కాంగ్రెస్లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఆ ప్రచారం మాత్రం ఆగలేదు.
ఆ తర్వాత ఈటల బీజేపీ తరుపున లోక్ సభ ఎన్నికల్లో మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైకమాండ్ ఆదేశిస్తే కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈటల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. మరోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందాలని బండి ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజలకు మరింత దగ్గరగా ఉంటున్నారు. వరుసగా బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ముంగిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బండి కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఈటల కరీంనగర్ సీటు గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మరి హైకమాండ్ కరీంనగర్ ఈటలకు ఇస్తుందా..? బండికి ఇస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE