ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందో లేదో తెలియదు కానీ.. తాజాగా విడుదల అయిన ఎన్నికల షెడ్యూల్ ఆ రాష్ట్రంలోని పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులను భయంకరంగా ఇరుకున పెట్టేస్తున్నాయట. అవును .. పెళ్లికి, ఎన్నికలకు ఏ మాత్రం లింక్ లేకపోయినా ఎన్నికల వల్ల పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటలు, వారి కుటుంబాలు మాత్రం ఇప్పటి నుంచే తెగ భయపడుతున్నారట. అలా ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా 50 వేలకు పైగా నూతన వధూవరులు..ఎన్నికల షెడ్యూల్ తేదీ ప్రకటన తెలిసిన దగ్గర నుంచీ గుబులు పడుతున్నారట.
పెళ్లి అంటే రెండు జీవితాలే కాదు.. రెండు కుటుంబాలు.. వారి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా కలిసి చేసుకునే సెలబ్రేషన్. మూడు ముళ్ల బంధంతో నూరేళ్లు కలిసి ఉండే జీవితాన్ని అందరి ఆశీస్సులతో చేసుకోవాలని ప్రతీ జంటా కోరుకుంటారు. అలా ఈ ఏడాది అతి బ్రహ్మండంగా పెట్టుకున్న ముహూర్తం ఇప్పుడు వధూవరులనే కాదు.. వారి కుటుంబ సభ్యులను, చుట్టాలను కూడా అయోమయంలో పడేసింది. ఇంకా చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా ఎన్నికల షెడ్యూల్ ఖాతాలోనే వేయాలేమో అంటున్నారు అక్కడి వారు.
తాజాగా తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో నవంబర్ 30 వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మిజోరాంలో నవంబర్ 7 వ తేదీన , మధ్యప్రదేశ్లో నవంబర్ 17 వ తేదీన , అలాగే రాజస్థాన్లో నవంబర్ 23 వ తేదీన , ఛత్తీస్గఢ్లో మాత్రం రెండు విడుతలుగా నవంబర్ 7వ తేదీన ,అలాగే నవంబర్ 17వ తేదీన ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 16 కోట్లమందికి పైగా ఓటర్లు ఉన్నారు. అంతేకాదు 60 లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు .
అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది రాజస్థాన్ వాసులకు. ఎందుకంటే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23న జరగనుంది. అయితే రాజస్థానీలు పరమ పవిత్రంగా అనుకునే రోజైన దేవ్ ఉథాని ఏకాదశి.. అదే రోజు వస్తుంది. దీంతో అత్యంత మంచి ముహూర్తంగా భావించిన రాజస్థానీలు.. నవంబర్ 23 వ తేదీన వివాహ తేదీని నిర్ణయించుకున్నాయి. రాజస్థాన్ వ్యాప్తంగా.. ఏకంగా 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరగబోతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఆ వెంటనే ఎన్నికల కోడ్ను అమలు పరిచింది. దీంతో ఎన్నికల పోలింగ్, ఎన్నికల కోడ్ ఆంక్షలతో నవంబర్ 23న పెళ్లిళ్లు చేసుకునేవారితో పాటు వాటికి హాజరయ్యేవారికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కట్నకానుకలు, బంగారు ఆభరణాలు, ఇతర బహుమతులు వంటి ఎన్నో పనులు చేయాల్సిన పెళ్లి సమయంలో ఎన్నికల కోడ్ పిడుగులా నెత్తిన పడిందనే వాదన వినిపిస్తోంది. నిజానికి దేవ్ ఉథాని ఏకాదశి అంటేనే రాజస్థాన్లో వివాహాలకు అత్యంత అనువైన రోజు. అందుకే ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అదే రోజు పోలింగ్ రావడంతో బంధువులు ఓటేస్తారా లేక తమను ఆశీర్శదించడానికి వస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట నూతన వధూవరులు.