ఈరోజు మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం చోటు చేసుకుంది. మంత్రి, ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దెస రాజకీయాలలో సైతం ఆసక్తిని రేకెత్తించింది. ముంబై అండర్ వరల్డ్, పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను బుధవారం ఈడీ ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. ఉదయం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత ఇంటికి చేరుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు గంటపాటు ప్రశ్నించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి మళ్లీ ఐదు గంటలకు పైగా ప్రశ్నించారు.
గ్యాంగ్స్టర్ దావూద్ సహచరులతో లావాదేవీలతో పాటు వారితో పలు భూముల ఒప్పందాలపై మాలిక్ పైన అభియోగాలు వచ్చాయి. ఇటీవల ఈడీ రాష్ట్రంలో ఈ కేసుకు సంబంధించి అనేక దాడులు నిర్వహించింది. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ను కూడా కస్టడీలోకి తీసుకుంది. అధికారుల విచారణలో నవాబ్ మాలిక్ కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలోనే మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయటం విశేషం. అయితే, మాలిక్ తమ దర్యాప్తుకు సహకరించడం లేదని ఈడీ తెలిపింది.
కాగా, మాలిక్ అరెస్ట్ పై ఎన్సిపి అధినేత శరద్ పవార్ స్పందించారు. “నవాబ్ మాలిక్ ఉన్నదున్నట్లు మాట్లాడతాడు. అతనిని ఇబ్బంది పెట్టడానికి వారు ఏదో ఒక సమస్యను లేవనెత్తారని మేము భావించాము. నేను మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు దావూద్తో నా పేరును కూడా ముడిపెట్టేందుకు ప్రయత్నించారు. కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని వేధించే ప్రయత్నం ఇది” అని పవార్ అన్నారు. ఈ నేపథ్యంలో ముంబై సెషన్స్ కోర్టు వెలుపల భద్రతను పెంచారు. అక్కడ మాలిక్ను రిమాండ్ కోరుతూ ఈడీ అతన్ని హాజరుపరచనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ