పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సభలో వాయిదా తీర్మానం నోటీసులు అందజేశాయి. కాంగ్రెస్ తో పాటుగా డీఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం తదితర పార్టీలు కూడా ఢిల్లీ అల్లర్లపై వేర్వేరుగా నోటీసులివ్వడంతో లోక్సభకు మొత్తంగా 23 నోటీసులు అందాయి. ఈ అంశంపై స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించాలంటూ సమావేశాలు మొదలైనప్పటి నుంచి విపక్ష సభ్యులు పోడియం వైపు దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సభలో సోమవారం నాడు తోపులాట కూడా జరిగింది.
లోక్సభలో జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో సభ్యులందరికీ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక జారీ చేశారు. లోక్సభలో నిరసనల సందర్భంగా తమ స్థానాలను వదిలిపెట్టి ఎదుటి పక్షం వైపు వెళితే ఈ పార్లమెంట్ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తానని పాలక, విపక్ష సభ్యులను హెచ్చరించారు. ముందుగా అన్ని పార్టీల పక్షాల నేతలతో స్పీకర్ సమావేశం నిర్వహించి సభ సజావుగా సాగేలా ఎంపీలంతా సహకరించుకునేలా చూడాలని సూచించారు. సభలో తోపులాట వంటి ఘటనలు మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తానే తగిన చర్యలు తీసుకుంటానని ఓం బిర్లా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఢిల్లీ అల్లర్ల అంశంపై హోలీ పండుగ తర్వాత చర్చ ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రకటించారు.
[subscribe]